నేషనల్ లెవల్ పొలిటికల్ మేజిక్కులకు కేరాఫ్ అడ్రస్గా వుండే మధ్యప్రదేశ్లో ఈసారి ఏం జరగబోతుంది. మార్చి సంక్షోభం కాంగ్రెస్ను గద్దెదించింది. కమల్నాథ్ పోయి కమలనాథులు పవర్లోకి వచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోర్త్ టర్మ్ సీఎం అయ్యారు. మరి ఈసారి బీజేపీ విక్టరీ కంటిన్యూ అవుతుందా? కసితో కాంగ్రెస్ పవర్ను చేజిక్కుంటుందా? ఎవరి వ్యహాలు వాళ్లవే. మధ్యప్రదేశ్ తీర్పు ఎటువంటి అన్నదీ ఆసక్తికరంగా మారింది.
అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్లు, మెజారిటీని పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ అభ్యర్థులలో 10 మంది భారీ ఓట్లను మెజారిటీతో గెలుపొందారు. ఈ టాప్ 10 ఎమ్మెల్యే అభ్యర్థులకు 11 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఇండోర్ 2 అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ మెండలా మొదటి స్థానంలో ఉండగా, టాప్ 10 అభ్యర్థుల జాబితాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మూడో స్థానంలో నిలిచారు. ఈ టాప్ 10 ఎమ్మెల్యేల్లో ఆరుగురు బీజేపీ, నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని టాప్ 10 అభ్యర్థులు భారీ విజయాన్ని సాధించారు. ఈ అభ్యర్థులపై భారీ ఓట్ల వర్షం కురిసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కాంగ్రెస్ నుండి జితూ పట్వారీ టాప్ 10 అభ్యర్థులలో ఉన్నారు.
ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన టాప్ 10 ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఇండోర్ 2 నుంచి రమేష్ మెండోలా పేరు మొదటి స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రమేష్ మెండోలాకు 1 లక్షా 38 వేల 794 ఓట్లు అంటే 63.95 శాతం ఓట్లు వచ్చాయి. అదేవిధంగా, భోపాల్లోని గోవింద్పురా స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కృష్ణ గౌర్కి 1 లక్షా 25 వేల 487 అంటే 58 శాతం ఓట్లు దక్కాయి. బుద్నీ నుంచి బీజేపీ అభ్యర్థి, ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు 1 లక్షా 23 వేల 492 ఓట్లు పోలయ్యాయి. మొత్తం నిజయోజకవర్గంలోని ఓట్లలో 60.25 శాతం చౌహాన్కు దక్కాయి. ఇండోర్ 5 స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మహేంద్ర హార్దియా 1 లక్షా 17 వేల 836 ఓట్లు రాగా 48.30 శాతం ఓట్లు అతని ఖాతాలో చేరాయి. ఇండోర్ 1 నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శుక్లాకు 1 లక్షా 14 వేల 555 (50.24 శాతం) ఓట్లు వచ్చాయి.
భోపాల్లోని నరేలా స్థానం నుంచి బీజేపీకి చెందిన విశ్వాస్ సారంగ్ కోక్కు 1 లక్షా 8 వేల 654 (53.24 శాతం), కుక్షి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేంద్ర బఘెల్కు 1 లక్షా 8 వేల 391 (65.63 శాతం), రౌ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జితు పట్వారీకి 1 లక్షా 7వేల 740 ఓట్లు వచ్చాయి. మొత్తం నియోజకవర్గ ఓట్లలో 49.95 శాతం దక్కించుకున్నారు. హుజూర్ నుంచి రామేశ్వర్ శర్మకు 1 లక్షా 7 వేల 288 (51.35 శాతం) ఓట్లు, భైందేహి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ధర్ము సింగ్ సిర్సామ్కు 1 లక్షా 4 వేల 592 (52.10 శాతం) ఓట్లు వచ్చాయి.