ఎన్నికల సమయం ఆసన్నమైదంటే చాలు.. రాజకీయ నేతలు ప్రజలను ఆకట్టుకోవడానికి తమ శక్తియుక్తులను కూడగట్టుకుని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ప్రజల మధ్యకు చేరుకుని వారిని ఆకట్టుకుని, ఆకర్షించడానికి చేసే యత్నాల గురించి ఎంత చెప్పినా తక్కువే..! ఇప్పుడు ఇదే విధంగా తెలంగాణలో ప్రచారం హోరెత్తుతుంది. పల్లెలు, పట్టణాల్లో రాజకీయ కోలాహలం నెలకొంది.
నామినేషన్లపర్వం ప్రారంభం కావటంతో అటు విపక్షాలు సైతం ప్రచారంలో జోరు పెంచాయి. ప్రచార రథాల రాక, మైకుల మోత, నేతల పర్యటనలు, కార్యకర్తల హడావిడితో పల్లెలు పట్టణాల్లో రాజకీయ కోలాహాలం నెలకొంది. ఎన్నికల గడువు నెల రోజులు కూడా లేకపోవటంతో, తెల్లవారింది మొదలు.. సాయంత్రం పొద్దుబోయేదాకా అభ్యర్థులు ఊరూవాడా చుట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న మంత్రులు అంతా సేఫ్ జోన్లో ఉన్నారా? ఎంత మంది మంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు? సేఫ్ జోన్లో ఉన్న మంత్రులు ఎవరు? రిస్క్ జోన్లోకి వెళుతున్నదీ ఎవరు అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో మొదలైంది.
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల గెలుపోటములపై చర్చ మొదలైంది. ఇటు బెట్టింగ్లు కూడా స్టార్ట్ అయ్యాయి. అధికార పార్టీకి చెందిన మంత్రుల్లో బరిలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందో అన్న హాట్ హాట్ చర్చ మొదలైంది. కేసీఅర్ కేబినెట్లో ఉన్న మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్లు పోటీలో లేరు. మిగిలిన వారంతా బరిలో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావులను పక్కన పెడితే, మిగిలిన వారిపై చర్చ మొదలైంది. అటు కాంగ్రెస్ ,ఇటు బిజెపి పార్టీలు బరిలో ఉన్న మంత్రులపై బలమైన అభ్యర్థులను దింపే ప్రయత్నం చేసింది. అదే సమయంలో ప్రధాన పార్టీలు మంత్రుల నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాయి. ఆయా పార్టీల అగ్ర నేతలు మంత్రుల నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి వెళుతున్నారు.
మొత్తంగా పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ మంత్రులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలు మారేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇక వీరి రాజకీయ భవిష్యత్ తేలాలంటే డిసెంబర్ మూడో తేదీ వరకు ఆగాల్సిందే..!