Telangana Assembly Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.. పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అంతేకాకుండా.. మాటల తూటాలు పేల్చుతూ.. ఎన్నికల రణరంగంలో సవాల్ చేసుకుంటున్నాయి. తాజాగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయాలను మరింత హీటెక్కించింది. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారన్నారు. మోదీని ప్రధానిని చేసే ఘట్టానికి పునాది పడింది ఇక్కడే అన్న ఆయన.. ఈ నేలతో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తెలంగాణలో మార్పు తుఫాన్ కనిపిస్తోంది.. ఇక్కడ గెలిచేది బీజేపీనే అన్నారు.. కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో 3 అంశాలు ఉన్నాయన్నారు. లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేతలను విడిచిపెట్టామని కాంగ్రెస్ మాపై ఆరోపణలు చేస్తోందని.. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలేది లేదని, కచ్చితంగా జైలులో వేస్తామంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ జన్మలో బీసీని సీఎంని చేయనివ్వరు.. మాది ఎన్డీయే, బీజేపీ.. ఓబీసీ మిత్రులపై అత్యంత ప్రేమ ఉంటుందంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
కాగా.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. రాహుల్ వచ్చి.. బీఆర్ఎస్ని బీజేపీ బీ టీమ్ అంటారని.. ఇప్పుడు మోదీ.. కాంగ్రెస్కి సీ టీమ్ అంటున్నారని.. తమది మాత్రం ముమ్మాటికీ టీ టీమ్, అంటే తెలంగాణ టీమ్ అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అన్నారు. ఇక ఒక్కసారి కూడా రుణమాఫీ చేయని వాళ్లు.. మాపై విమర్శలు చేయడం విడ్డూమన్నారు. నిన్నటి వరకు మత రాజకీయాలు చేశారు.. ఇప్పుడు కుల రాజకీయాలకు తెరతీశారని విమర్శించారు. బీజేపీ హయాంలో బీసీలకు మిగిలింది అరణ్య రోదనేనన్నారు. ఇక TSPSC పేపర్లు లీక్ చేసింది మీ బీజేపీ నేతలే అని.. నిందితులతో వేదిక పంచుకుని మాపై నిందలా అంటూ మండిపడ్డారు.