ATM Withdrawal: ఏటీఎమ్‌లో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలో తెలుసా.?

ATM Withdrawal: ఏటీఎమ్‌లో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలో తెలుసా.?

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ పెరిగిన ఈ రోజుల్లోనూ ఇప్పటికీ ఏటీఎమ్‌లో డబ్బులు విత్‌డ్రా చేస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ఏటీఎమ్‌లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం సులభతరమైంది. అయితే ఏటీఎమ్‌లో డబ్బు తీసుకునే సమయంలో చిరిగిన నోట్లు రావడం కూడా సర్వసాధారణమైన విషయం తెలిసిందే.

మనలో చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. చిరిగిన నోట్లను మార్చుకోవడం అంత సులభమైన విషయమేమి కాదు. ఎవరికీ ఇచ్చినా తీసుకోవడానికి నిరాకరిస్తుంటారు. మరి ఏటీఎమ్‌ నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి.? బ్యాంక్‌ నియమాలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.. ఏటీఎమ్‌ల నుంచి చిరిగిన నోట్లు వస్తే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిరిగిన నోట్లను బ్యాంకులో మార్చుకునే వెసులుబాటు ఉందని మీకు తెలుసా.? అవును.. మ్యుటిలేడెట్ నోట్లను సులభంగా భర్తీ చేసుకోవచ్చు. ఏటీఎమ్‌లో వచ్చిన చిరిగిన నోట్లను మార్చుకునేందుకు బ్యాంకు నిరాకరించకూడదని ఆర్‌బీఐ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. కేవలం నిమిషాల్లోనే నోట్లను మార్చుకోవచ్చు.

ఇందుకోసం మీకు చిరిగిన నోటు వచ్చిన ఏటీఎమ్‌ లింక్‌ చేసిన బ్యాంకులో సంప్రదించాల్సి ఉంటుంది. సదరు బ్యాంకుకు వెళ్లి అప్లికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం, ఏటీఎమ్‌ పేరును పేర్కొనాలి. దీంతో పాటు ఏటీఎమ్‌ ట్రాన్సాక్షన్‌ తర్వాత వచ్చే స్లిప్‌ను అప్లికేషన్‌కు జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్లిప్‌ ఇవ్వకపోతే మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించినా సరిపోతుంది. ఈ వివరాలను అన్నింటినీ అందిస్తే వెంటనే బ్యాంకులో నోట్లను మార్చుకోవచ్చు. చిరిగిన నోట్లను మార్చడాన్ని బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో నిరాకరించకూడదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2017 ఏప్రిల్‌లో తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఏటీఎమ్‌లలో చిరిగిన నోట్లు రాకుండా ఉండడానికి దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ అత్యాధునిక నోట్ సార్టింగ్ మిషన్‌ను ఉపయోగిస్తుంది. దీంతో చిరిగిన నోట్లు ఏటీఎమ్‌లో రాకుండా చేస్తుంది. అయితే ఒకవేళ పొరపాటున ఏదైనా చిరిగిన నోటు వచ్చినా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉంటే ఒకవేళ ఏదైనా బ్యాంకు చిరిగిన నోటును మార్చడానికి నిరాకరిస్తే రూ. 10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం చిరిగిన నోట్లను మార్చే బాధ్యత బ్యాంకుపై పాత్రమే ఉంటుంది. డబ్బును ఏటీఎమ్‌లో ఇన్‌స్టాల్‌ చేసే ఏజేన్సీలకు ఎలాంటి సంబంధం ఉండదు.
ఇక చిరిగిన నోట్లను బ్యాంకులు మాత్రమే కాకుండా రిజర్వ్‌ బ్యాంక్ కార్యాలయాల్లో కూడా మార్చుకోవచ్చు. ఆర్‌బీఐ నిబంధలన ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి గరిష్టంగా 20 నోట్లను మార్చుకోవచ్చు, ఈ నోట్ల గరిష్ట విలువ రూ. 5000 మించకూడదు. అయితే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. నోట్లు బాగా కాలిపోయినా, ముక్కలుగా మారినా వాటిని మార్చుకోవడానికి కుదరదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *