ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ నియామకం వివాదాస్పదం అవుతుంది. ఏకపక్షంగా ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ పేరును లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు చేయటంతో ఈ కొత్త వివాదం నెలకొంది. అలహాబాద్ మాజీ జడ్జి జస్టిస్ ఉమేశ్ కుమార్ ను ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్. DERC ఛైర్మన్ గా రాజస్థాన్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ సంగీత్ లోధా పేరును నిన్న లెఫ్టినెంట్ గవర్నర్ కు సిఫారసు చేసింది ఢిల్లీ ప్రభుత్వం.
ఢిల్లీ రాష్ట్ర కేబినెట్ సిఫారసును కాదని ఏకపక్షంగా ఎలా నియామకం చేస్తారంటూ రాష్ట్ర ప్రభుత్వం మండిపడింది. ఢిల్లీలోని ఎన్నికైన ప్రభుత్వ సిఫార్సుకు వ్యతిరేకంగా DERC ఛైర్మన్ను నియమించడం చట్టం, రాజ్యాంగ విరుద్ధమన్న ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కి ఎందుకు మెజారిటీ ఇచ్చారని ఢిల్లీ ప్రజలపై బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోందన్న విమర్శ ఉంది. ఢిల్లీ ప్రజలకు 24గంటల ఉచిత కరెంటు అందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు అతిషి. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేసింది ఆప్ ప్రభుత్వం.