ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు నటుడు సంపూర్ణేష్ బాబు. తొలి సినిమా హృదయకాలేయంతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశాడు. పాజిటివ్ పబ్లిసిటీతోనే కాకుండా నెగిటివ్ పబ్లిసిటీతోనూ అందరి దృష్టిని ఆకట్టుకోవచ్చని నిరూపించాడు సంపూర్ణేష్ బాబు.
హృదయకాలేయం సినిమా విడుదల తర్వాత సంపూర్ణేష్ బాబు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఆ తర్వాత అదే అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది. దీంతో సంపూ సినిమా వస్తుందంటే మినిమం కామెడీ ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఇక సంపూర్ణేష్ బాబుతో బడా నిర్మాణ సంస్థలు సైతం సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. బిగ్బాస్లో పాల్గొని ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం తాజాగా విడుదలకు సిద్ధమైంది. ‘మార్టిన్ లూథర్ కింగ్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘మండేలా’ చిత్రానికి రీమేక్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. సంపూ మార్క్ కామెడీ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్నట్లు మేకర్స్ అంచనా వేస్తున్నారు. తమిళంలో యోగిబాబు పోషించిన పాత్రలో సంపూర్ణేష్ బాబు నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే అక్టోబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో పాల్గొన్న సంపూర్ణేష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఈ సందర్భంగా సంపూ మాట్లాడుతూ.. తన అనారోగ్యం బాగా లేని కారణంగా సినిమాల్లో నటించడం లేదని గతంలో వచ్చిన వార్తలపై స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని మార్టిన్ లూథర్ కింగ్ విడుదలైన నెలల వ్యవధిలోనే మరో రెండు సినిమాలు రానున్నాయని తెలిపాడు. ఇక ఇండస్ట్రీలో కొందరు కావాలనే సంపూని తొక్కేస్తున్నారని, అందుకే పెద్దగా సినిమాలు చేయడం లేదనే టాక్ వినిపించిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, తనతో అందరు బాగానే ఉంటారని, అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదని రూమర్స్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు.