Titan Submersible Implosion: అట్లాంటిక్ మహా సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్(Titanic) ఓడను చూసివచ్చేందుకు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు జల సమాధి అయిపోయారు. సముద్రం లోపలికి టైటాన్ సబ్మెర్సిబుల్ నౌకలో బయలుదేరిన నలుగురు కుబేరులతో పాటు పైలట్ చనిపోయినట్టు ఓషన్ గేట్(OceanGate) సంస్థ ప్రకటించింది. కనిపించకుండా పోయిన కొన్ని గంటలకే టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయి ఉండొచ్చని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన అమెరికా కోస్ట్ గార్డ్ వెల్లడించింది. సౌండ్ మానిటరింగ్ పరికరాల ద్వారా పేలుడుపై నిర్ధారణకు వచ్చినట్టు తెలిపింది. టైటాన్ సబ్మెర్సిబుల్ శిథిలాలు కొన్ని లభ్యయినట్టు వెల్లడించింది.
కెటాస్ట్రోపిక్ ఇంప్లోషన్ కారణంగానే టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయి ఉంటుందని అమెరికా రక్షణ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అత్యంత వేగంతో సముద్రం అడుగున నీటి పీడనాన్ని(Water pressure) చీల్చుకుంటూ టైటాన్ సబ్మెర్సిబుల్ దూసుకెళుతుండగా ఏర్పడిన ఒత్తిడి కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని తెలిపారు. సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం చదరపు అంగుళానికి 14.7 పౌండ్లు (psi)గా ఉంటుంది. టైటాన్ సబ్మెర్సిబుల్ ప్రయాణించిన లోతులో నీటి పీడనం దాదాపు 6,000 psiగా ఉందని అంచనా. సైంటిఫిక్ అమెరికన్ గణాంకాల ప్రకారం చూస్తే.. సముద్ర గర్భంలో సంచరించే భారీ తెల్ల సొరచేప కాటు వేసినప్పుడు దాదాపు 4,000 psi శక్తిని కలిగి ఉంటుందట.
మిల్లీ సెకన్లలోనే బ్లాస్ట్: టైటాన్ సబ్మెర్సిబుల్ విస్సోటనానికి దానిలో తలెత్తిన లోపాలతో పాతు ఇతర సాంకేతిక కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అత్యధిక నీటి పీడనం వల్ల మిల్లీ సెకన్లలోనే టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. టైటాన్ సబ్మెర్సిబుల్ లో ప్రయాణించిన వారెవరూ బతికుండే అవకాశమే లేదని అంటున్నారు. టైటానిక్ ఓడ శిథిలాలు ఉత్తర అట్లాంటిక్ సముద్రగర్భంలో దాదాపు 3,800 మీటర్లు (12,400 అడుగులు) లోతులో ఉన్నాయని అంచనా.