Radikaa Sarathkumar : బండారు క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి రోజాకు నటి రాధిక మద్దతు, మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం

Radikaa Sarathkumar – Roja : ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రోజాకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. రోజాకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజాగా మరో సినీ నటి రాధిక సైతం స్పందించారు. మంత్రి రోజాకు ఆమె మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను రాధిక తప్పుపట్టారు. వెంటనే రోజాకు క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు.
”రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? చివరికి మహిళలను వ్యభిచారులుగా చిత్రీకరిస్తారా? దీని వల్ల మేము భయపడబోము. ఇలా మాటలతో హింసించడం సిగ్గు చేటు. వెంటనే క్షమాపణలు చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోండి. రోజాకు నేను అండగా ఉంటాను. ఇంత నీచంగా మాట్లాడటం దారుణం. ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ వివక్షపై ప్రధాని మోదీ దృష్టి సారించాలి” అని నటి రాధిక అన్నారు.
నటి ఖుష్బూ సైతం రోజాకు మద్దతుగా నిలిచారు. రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణం అన్నారు. ఒక మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రోజాకు తక్షణమే క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను డిమాండ్ చేశారు ఖుష్బూ. ఆయన క్షమాపణ చెప్పేదాకా సాగే పోరాటంలో తాను కూడా కలుస్తానని చెప్పారు. ఓవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారని, మరోవైపు మహిళా సాధికారత కోసం చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బండారు లాంటి వ్యక్తులు మహిళా నేతలను ఉద్దేశించి నీచంగా మాట్లాడటం ఆవేదన కలిగించే అంశమన్నారు ఖుష్బూ.

CM Jagan: ఢిల్లీలో బిజీబిజీగా సీఎం జగన్‌.. అమిత్‌షా తో ప్రత్యేక భేటీ..

ఏపీ సీఎం జగన్‌ హస్తినలో రెండో రోజు బిజీ బిజీగా గడిపారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో సీఎం జగన్‌ పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యి..కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ అంశాలపై చర్చించారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం జగన్‌. వాళ్లిద్దరి మధ్య కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు రాజకీయపరమైన చర్చ జరిగింది. ఇక దాంతోపాటు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్, చంద్రబాబు అరెస్టు పైనా కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమీక్షలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న ప్రయత్నాల్లో ఉన్న కేంద్ర సర్కార్‌..తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 17వేల 600 కిలోమీటర్ల పొడవైన రోడ్ల నిర్మాణాన్ని చేపబడుతోంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో టెలికాం సేవల విస్తరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గత నాలుగు దశాబ్ధాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోందని తెలిపారు సీఎం జగన్‌. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక ప్రకారం..తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, స్ధానిక ప్రజల హక్కుల పరిరక్షణ, బహుముఖ విధానం-సానుకూల ఫలితాలను అందించిందన్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ మద్దతుతో, ఏపీ సర్కార్‌ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటోంద న్నారు. ప్రభుత్వం అనుసరించిన వ్యూహాల వల్ల రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద హింసాత్మక ఘటనలు తగ్గాయని వెల్లడించారు సీఎం జగన్‌. ఏపీలో 5 జిల్లాలో విస్తరించిన మావోయిస్టు కార్యకలాపాలు ఇప్పుడు కేవలం అల్లూరి, పార్వతీపురం, మన్యంజిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని గుర్తు చేశారు జగన్‌. ఇక సీఎం జగన్‌ ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కూడా అడిగినట్లు సమాచారం. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇస్తే శనివారం ఉదయం సీఎం జగన్‌, ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది.

Andhra Pradesh: నాయుడుపేట గ్రీన్‌ఫీల్డ్ లామినేట్ ప్రాజెక్ట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్

GreenLam Industries: ప్రపంచంలోని టాప్ 3 లామినేట్ తయారీదారులలో ఒకటైన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలోని తన అత్యాధునిక తయారీ కేంద్రంలో శుక్రవారం నుంచి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించినట్లు వెల్లడించింది. లామినేట్ యూనిట్ ఏర్పాటు దక్షిణ భారతదేశంలో తన తయారీ సామర్థ్యాలను విస్తరించేందుకు, నాణ్యమైన లామినేట్ షీట్లు మరియు కాంపాక్ట్ బోర్డ్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలలో కంపెనీ గణనీయమైన ముందడుగు వేసింది.
డెకరేటివ్ సర్ఫేసింగ్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉంటూ, సబ్‌స్ట్రేట్ విభాగంలోకి అడుగుపెట్టిన గ్రీన్‌లామ్ డెకరేటివ్ లామినేట్‌లు, కాంపాక్ట్ లామినేట్‌లు, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ క్లాడ్‌లు, డెకరేటివ్ వెనీర్లు, ఇంజినీరింగ్ చెక్క ఫ్లోర్లు, డోర్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేస్‌ల కోసం ప్లైవుడ్ వరకు విభిన్న ఉత్పత్తులను అందిస్తోంది. తయారీలో నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉపరితల పరిష్కారాలను అందించడంలో అగ్రగామిగా ఉండటంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ మార్కెట్ అవకాశాన్ని వేగవంతం చేస్తూ, దాని వృద్ధికి కొత్త ఆదాయ వనరులను అందిస్తుంది.
గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఈ తయారీ కేంద్రం, ఏడాదికి 3.50 మిలియన్ లామినేట్ షీట్‌లు, కాంపాక్ట్ బోర్డ్‌లతో ఆకట్టుకునే ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా నెలకొల్పారు. లామినేట్ పరిశ్రమలో శ్రేష్ఠత, ఆవిష్కరణలకు మరియు ప్రాంతం ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు, తన వినియోగదారులకు అత్యుత్తమ-నాణ్యత కలిగిన లామినేట్ ఉత్పత్తులను అందించేందుకు గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ నిబద్ధతకు ఈ తయారీ కేంద్రం ఏర్పాటు నిదర్శనంగా నిలుస్తుంది.

Chanadra Babu: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీలో టీడీపీ ఆందోళనలు ఉదృతం.. సత్యమేవ జయతే అంటూ నిరసనలు

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఆందోళనలు ఉధృతం చేస్తోంది. కాంతితో క్రాంతి పేరిట మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు లోకేష్‌. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీలో టీడీపీ ఆందోళనలను ఉదృతం చేస్తోంది. సత్యమేవ జయతే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు. మరోవైపు 20 రోజుల తరువాత నారా లోకేష్‌ ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకున్నారు . కుటుంబసభ్యులతో కలిసి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో ములాఖాత్‌ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేశారని ఆరోపించారు లోకేష్‌. ముందు 3 వేల కోట్ల స్కామ్‌ అన్నారు. ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. వైసీసీ సర్కార్‌ వ్యవస్థలను మేనేజ్‌ చేసి చంద్రబాబును జైలుకు పంపారని విమర్శించారాయన. అక్రమ అరెస్టులతో చంద్రబాబును అడ్డుకోలేరన్నారు. పోరాటం ఆపొద్దు శాంతియుతంగా పోరాడండి అని చంద్రబాబు తమతో చెప్పారన్నారు లోకేష్‌….

సత్యమేవ జయతే కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీకి అండగా నిలిచారన్నారు లోకేష్‌. వైసీపీ వైఖరిని నిరసనగా కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపునిచ్చామని ట్వీట్‌ చేశారాయన. చంద్రబాబు చైతన్యాన్ని నిర్బంధించడం ఎవరి తరం కాదన్నారు.ఏపీలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొవాలని పిలుపునిచ్చారు లోకేష్‌.

శనివారం రాత్రి 7గంటలకు ఇళ్లలో లైట్స్‌ ఆఫ్‌ చేసి కొవ్వొత్తులు వెలిగిద్దాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు లోకేష్‌. తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగలేదన్నారు. నిరసనలు మరింత ఉదృతంచేస్తామన్నారాయన. పాదయాత్ర విషయంలో చర్చించి త్వరలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు లోకేష్‌.

1 5 6 7