పెళ్లంటే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు కుమ్మరిస్తారు. విందు, చుట్టాలు, వందలాది కాదు వేలాది మందికి భోజనాలు వైభవంగా జరిపిస్తారు. కానీ..ఇక్కడ జరిగేది రిసెప్షన్ మాత్రమే..పెళ్లికి మించి ఏర్పాట్లు చేస్తున్నారు. పాతిక ఎకరాల విస్తీర్ణం.. 11 షెడ్డులు.. పదుల సంఖ్యలో వంట మాస్టర్లు.. 30 టీమ్లు.. 28 రకాల వంటలు.. ఇంతకీ ఎక్కడ?
తూర్పుగోదావరిజిల్లా రాజమహేంద్రవరం గోదావరి తీరాన అతిపెద్ద వేడుక జరగబోతోంది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా నిర్వహించేంందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్ను రాజమండ్రి దివాన్ చెరువు డీవీబీ రాజు లేఔట్లో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేశారు. వివాహానికి లక్షలాది మందిని ఆహ్వానిస్తున్నారు. సుమారు మూడు లక్షల మందికి పైగా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. 28 రకాల కాయగూరాలతో పసందైన విందు భోజనాన్ని జక్కంపూడి కుటుంబీకులు ఏర్పాటు చేస్తున్నారు.
డోలు, సన్నాయి వాయిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి వివాహ విందుకు రావాలని ఆహ్వానపత్రిక అందిస్తున్నారు జక్కంపూడి కుటుంబీకులు, వారి అభిమానులు. ఒక్క రాజమండ్రే కాదు…తూర్పు గోదావరిజిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి పలువురు స్థానికులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులను ఆహ్వానించారు. వివాహ ఏర్పాట్లను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన అభిమానులు దగ్గరుండి అన్నీ ఏర్పాట్లు చూస్తున్నారు. గోదావరి తీరాన ఇంత పెద్ద వేడుక జరగడం ఇదే మొదటిసారని జక్కంపూడి అభిమానులు అంటున్నారు.
మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా జక్కంపూడి వారి వివాహ విందుకు హాజరవుతున్నారు. ఈ మేరకు అధికారులు సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్చెరువు చేరుకుంటారు. అక్కడ డీబీవీ రాజు లే–అవుట్లో జరగనున్న విజయ్ గణేష్ మోహన్ వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. ముఖ్యమంత్రి వస్తుండటంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఇక ఈ వేడకకు తూర్పుగోదావరి జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి స్థానికులు, సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు రానున్నారు. అధిక సంఖ్యలో అతిథులు నియోజకవర్గం, వివిధ జిల్లాల వస్తుండటంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్రావు తెలుగు రాష్ట్రాలలో ఎంతోమందికి గుర్తింపు ఉండడంతో.. ఆయనతో అనుబంధం ఉన్నా ప్రతిఒక్కరిని ఈ రిసెప్షన్ కీ ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. జక్కంపూడి వారు ఇచ్చే విందునతో పాటు వినోదాన్ని పంచే విదంగా పిల్లలకోసం ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు.